సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఏఐటీయూసీ డిమాండ్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ కరోనా ఓపీ ఎదుట బుధవారం ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రిమ్స్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా అధ్యక్షుడు నల్ల శివన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి డోంగ్రే చందు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిర్ర దేవేందర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు “సమాన పనికి సమాన వేతనం” సూత్రాన్ని అమలు చేసి కనీసం రూ.26 వేల వేతనం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఏడాది పాటు నిరంతరంగా పనిచేసే ప్రతి కార్మికుడికి ఒక నెల వేతనానికి సమానమైన బోనస్ ఇవ్వాలని, పండుగ సెలవులు, ఆర్జిత సెలవులు, పీఎఫ్, ఈఎస్ఐ వంటి చట్టబద్ధ హక్కులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ శానిటేషన్ కార్మికులకు పేషెంట్ కేర్ విభాగంలో పదోన్నతులు కల్పించాలని కోరారు. కొత్త కాంట్రాక్టర్ను నియమించడంతో పాటు కార్మికులకు యూనిఫాంలు, నెలనెలా వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ తదితర హక్కులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు ఎండి ముజీబ్, ఎస్.కె. ఇక్బాల్, దత్తాత్రి దాస్, పెందూర్ దిలీప్, నిట్టెడి నగేష్, ఇప్ప శ్రీను, జి. సంగీత, నర్సమ్మ, కమల, పద్మ, బి. లక్ష్మి, ఇర్ఫాన్, వెంకటేష్, విఠల్, సురేష్, రమేష్, పులి సునీత, రమతో పాటు పెద్ద సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.










