Tuesday, 1 September 2026

Tag: Government activity

ఖమ్మం

మధిర ఏరియా ఆసుపత్రిలో గైనకాలజీ పోస్టు.. రూ.లక్ష గౌరవ వేతనం

ఖమ్మం: అత్యవసర గైనకాలజీ వైద్య సేవలను అందించేందుకు మధిర ఏరియా హాస్పిటల్‌లో ఒక గైనకాలజీ స్పెషలిస్ట్ వైద్యుడిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించేందుకు వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఈ నియామకం చేపడుతున్నారు. ఎంపికైన వైద్యుడికి నెలకు రూ.1,00,000 గౌరవ వేతనం చెల్లించనుండగా, ఉద్యోగ కాలం చేరిన తేదీ నుంచి రెండు నెలలు మాత్రమే ఉంటుంది. అభ్యర్థి MBBSతో పాటు MS (OB&GY) లేదా DGO ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి, ముఖ్యంగా గతంలో ప్రభుత్వ ఆసుపత్రులు లేదా ప్రభుత్వ రంగంలో గైనకాలజీ విభాగంలో పనిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఎంపిక MS (OB&GY) మార్కుల మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా జరుగుతుంది. ఇంటర్వ్యూ సెప్టెంబర్ 3, 2026 గురువారం ఉదయం 11 గంటలకు ఖమ్మంలోని వి.వెంకటాయపాలెం IDOCలోని జిల్లా ఆసుపత్రుల ప్రధాన కార్యాలయం, F2 బ్లాక్, మొదటి అంతస్తులోని సూపరింటెండెంట్ కార్యాలయంలో నిర్వహిస్తారు. అభ్యర్థులు అసలు సర్టిఫికెట్లు, అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో హాజరుకావాలి. TA/DA చెల్లించరు. పూర్తి వివరాలకు ఖమ్మం జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలి.

ఖమ్మం

ఖైదీలు, బాలలకు సకాలంలో ఉచిత న్యాయసేవలు అందాలి

ఖమ్మం: నెలవారీ తనిఖీల్లో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి. దేవి మానస సోమవారం జిల్లా జైలును, బాలల సదన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి వసతులు, పరిసరాలను పరిశీలించి అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. అర్హత కలిగిన ఖైదీలు, బాలలకు ఉచిత న్యాయ సేవలు, న్యాయ సలహాలు అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. న్యాయ సహాయం అవసరమైన వారిని గుర్తించి, వారి సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ సకాలంలో న్యాయం అందేలా అధికారులు చొరవ చూపాలని అన్నారు.

ఖమ్మం

బీసీ సంక్షేమ అధికారి జ్యోతికి పదోన్నతి డిప్యూటీ డైరెక్టర్‌గా హోదా కల్పిస్తూ ఉత్తర్వులు

ఖమ్మం జిల్లాలో ఆరేళ్లకు పైగా బీసీ సంక్షేమ శాఖలో సేవలందించిన జిల్లా బీసీ సంక్షేమ అధికారి గుడికందుల జ్యోతికి పదోన్నతి లభించింది. ఆమెకు డిప్యూటీ డైరెక్టర్ హోదా కల్పిస్తూ బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాల మాయాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్యాభివృద్ధి, సంక్షేమం కోసం జ్యోతి ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ముఖ్యంగా విద్యార్థులకు ఉచిత కోచింగ్‌తో పాటు అవసరమైన ఇతర సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేశారు. శాఖలో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ విద్యార్థులు, బీసీ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. పదోన్నతి పొందిన గుడికందుల జ్యోతికి పలువురు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.

ఖమ్మం

పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కమిషనర్ అభిషేక్ అగస్త్య

ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పక్కా ప్రణాళికతో చర్యలు చేపట్టాలని ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అధికారులను ఆదేశించారు. శనివారం శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఎన్విరాన్‌మెంట్ విభాగం అధికారులతో నగర పారిశుధ్య నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. పారిశుధ్య సమస్యలు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, వాటికి తక్షణ పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని సూచించారు. నగరంలోని రోడ్లు, కాలనీలు, ప్రధాన ప్రాంతాల్లో నిరంతర పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. సమస్యలపై వేగంగా స్పందించేందుకు ప్రత్యేకంగా క్విక్ రెస్పాన్స్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని కమిషనర్ సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు.

ఖమ్మం

ఓటర్ల జాబితాపై విచారణకు శ్రీకారం

ఖమ్మం నగరంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లిన వారి వివరాలపై శనివారం నుంచి విచారణ ప్రారంభమైంది. వీఆర్‌ఏల ఆధ్వర్యంలో అధికారులు ఓటర్ల జాబితాలతో పాటు సంబంధిత వ్యక్తులు సమర్పించిన పత్రాలను పరిశీలిస్తున్నారు. ఖమ్మం నియోజకవర్గంలోని 361 పోలింగ్ కేంద్రాల్లో శనివారం నుంచి సెప్టెంబర్ 5 వరకు విచారణ కొనసాగుతుందని ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ ఆగస్త్య తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు తప్పనిసరిగా విచారణకు హాజరై అవసరమైన పత్రాలను సమర్పించాలని ఆయన సూచించారు.

ఖమ్మం

జిల్లా ఆస్పత్రి అధికారులకు ప్రత్యేక ఫోన్ నంబర్లు.. ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం

ఖమ్మం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ఫోన్ నంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎం. నరేందర్ తెలిపారు. ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి బంధువులు వివిధ విభాగాలకు సంబంధించిన సమాచారం, ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం ఈ నంబర్లను వినియోగించుకోవచ్చని సూచించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు 9063068282, అసిస్టెంట్ డైరెక్టర్‌కు 9063068181, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కు 9063068383, ప్రభుత్వ ఆస్పత్రి ఆర్‌ఎంఓకు 9063068484, మాతాశిశు సంరక్షణ కేంద్రం ఆర్‌ఎంఓకు 9063068585 నంబర్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఆస్పత్రిలో సేవలకు సంబంధించి ఏవైనా సమస్యలు, సూచనలు లేదా ఫిర్యాదులు ఉంటే ఈ నంబర్ల ద్వారా నేరుగా అధికారులను సంప్రదించాలని, ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడమే ఈ చర్య ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

ఖమ్మం

SIR జాబితాలో పేరు లేదా? నోటీసుల ప్రక్రియ షురూ

SIR తొలి దశ ఓటరు జాబితాలో పేర్లు నమోదు కాని ఓటర్లకు నోటీసులు అందజేసే ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఖమ్మం నగరంలోని 54వ డివిజన్‌లో ఓటరు జాబితాలో పేరు కనిపించని ఓటరుకు BLO స్వప్న నోటీసు అందజేశారు. జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి ఓటరూ పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పేరు లేకపోతే నోటీసులో పేర్కొన్న వివరాల ఆధారంగా అవసరమైన పత్రాలను సమర్పించి, తమ అభ్యంతరాలను నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. SIR ప్రక్రియలో భాగంగా ఓటర్లందరూ సహకరించాలని అధికారులు కోరారు.

ఖమ్మం

UPIకి 10 ఏళ్లు.. చిల్లర కష్టాలకు చెక్!

దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను సమూలంగా మార్చిన యూపీఐ (UPI)కి నేటితో పదేళ్లు పూర్తయ్యాయి. 2016 ఆగస్టు 25న ప్రారంభమైన యూపీఐని ఆర్‌బీఐ మార్గదర్శకాలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రూపొందించింది. ఫోన్ నంబర్లు, క్యూఆర్ కోడ్లు, వివిధ యాప్‌ల ద్వారా క్షణాల్లో నగదు బదిలీ చేసే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో చిల్లర సమస్యలు, నగదు తీసుకెళ్లాల్సిన అవసరం గణనీయంగా తగ్గింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం 2016–17లో యూపీఐ లావాదేవీలు 1.78 కోట్లుగా ఉండగా, 2025–26 నాటికి 24,162 కోట్లకు పైగా పెరిగాయి. పదేళ్లలో యూపీఐ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగంగా మారి, డిజిటల్ చెల్లింపుల విప్లవానికి నాంది పలికింది.

ఖమ్మం

వెల్నెస్ సెంటర్ వైద్యుడిపై కలెక్టర్ చర్యలు

ఖమ్మం జనరల్ ఆసుపత్రిలోని వెల్నెస్ సెంటర్‌లో మహిళా వైద్యులు, సిబ్బందిని వేధించారనే ఆరోపణలపై ఓ వైద్యుడిపై కలెక్టర్ దివాకర్ టి.ఎస్. సోమవారం చర్యలు తీసుకున్నారు. ఈ ఆరోపణలపై జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ఈ నెల 5న కమిటీ నివేదికను కలెక్టర్‌కు సమర్పించింది. నివేదికలోని అంశాలను పరిశీలించిన కలెక్టర్ దివాకర్ టి.ఎస్. సదరు వైద్యుడిని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు సరెండర్ చేయాలని ఖమ్మం జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం. నరేంద్రను ఆదేశించారు. మహిళా వైద్యులు, సిబ్బంది చేసిన ఫిర్యాదులపై విచారణ జరిపి కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఖమ్మం

క్రిటికల్ కేర్ యూనిట్‌లో అదనపు కలెక్టర్ శ్రీజ పరిశీలన :

ఖమ్మం ఆగష్టు 11 (పున్నమి ప్రతినిధి) ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ యూనిట్‌ను అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ మంగళవారం పరిశీలించారు. యూనిట్‌లోని వసతులు, వైద్య సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన అదనపు వసతుల కోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రోగుల వెంట వచ్చే సహాయకులకు మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. అత్యవసర సేవల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.