Friday, 10 July 2026

Blog

News

ఇండోనేషియా పర్యటనతో ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ప్రారంభం

ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనతో తన మూడు దేశాల విదేశీ పర్యటనను ప్రారంభించారు. జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్యం, రక్షణ, ఇండో-పసిఫిక్ సహకారంపై కీలక చర్చలు జరగనున్నాయి. అనంతరం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలు కొనసాగనున్నాయి.

News

ముంబై–పుణే ప్రాంతాల్లో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగి ముగ్గురు మృతి

మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబై, పుణే ప్రాంతాల్లో సాధారణ జీవనం అస్తవ్యస్తమైంది. కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. పలు రైళ్లు రద్దు కాగా, ముంబై–పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సహాయక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

News

పశ్చిమ బెంగాల్‌లో బాలికపై అత్యాచారం, హత్య కేసులో ముగ్గురు అరెస్ట్

పశ్చిమ బెంగాల్‌లో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టంతో పాటు హత్య, సామూహిక అత్యాచారం కేసులు నమోదు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.

News

జనగణనలో కుల వివరాలకు ఓపెన్ కాలమ్

2027 జనగణన రెండో దశ రిహార్సల్‌లో కుల వివరాల నమోదు కోసం ప్రత్యేకంగా ఓపెన్ కాలమ్‌ను చేర్చారు. ప్రజలు తమ కులాన్ని స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారిగా అన్ని కులాల వివరాలను డిజిటల్ జనగణనలో నమోదు చేయనున్నారు. తుది విధానాన్ని సెప్టెంబర్‌లో ప్రకటించనున్నారు.

News

శ్రీలంక జైలులో ఘర్షణలు.. 26 మంది మృతి

శ్రీలంకలోని నెగోంబో జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో 26 మంది మృతి చెందారు. మృతుల్లో ఏడుగురు జైలు అధికారులు కూడా ఉన్నారు. వంద మందికిపైగా గాయపడగా, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సైన్యాన్ని రంగంలోకి దించారు. సంఘటనపై ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించినట్లు శ్రీలంక ప్రభుత్వం వెల్లడించింది.

News

పహల్‌గామ్ ఉగ్రదాడి కేసులో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌పై ఎన్‌ఐఏ తాజా ఛార్జిషీట్

పహల్‌గామ్ ఉగ్రదాడి కేసులో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో పాకిస్థాన్ కుట్ర, ఉగ్రవాదులకు అందించిన మద్దతు, దాడి వెనుక ఉన్న కీలక ఆధారాలను ఛార్జిషీట్‌లో పొందుపరిచింది. దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్‌ఐఏ తెలిపింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డెంగ్యూ నివారణ మాసోత్సవ అవగాహన కార్యక్రమం

ఆత్మకూరు జ్యోతిరావు పూలే బాలికల గురుకులంలో డెంగ్యూ నివారణ అవగాహన సదస్సు. విద్యార్థినులకు ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేసిన డాక్టర్ సాయి ప్రసన్న. ఆత్మకూరు: యూపీహెచ్‌సీ అరుంధతివాడ,ఆత్మకూరు నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం – డెంగ్యూ నివారణ మాసోత్సవం సందర్భంగా ప్రత్యేక అవగాహన యూపీహెచ్‌సీ అరుంధతివాడ, ఆత్మకూరు ఆధ్వర్యంలో స్థానిక మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు ప్రత్యేక వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమం మరియు ఉచిత మందుల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డా. ఎం. సాయి ప్రసన్న హాజరై విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.డెంగ్యూ నివారణ మాసోత్సవం సందర్భంగా విద్యార్థినులకు డెంగ్యూ వ్యాధిపై సమగ్ర అవగాహన కల్పించారు. దోమలు పెరగకుండా ఇంటి, పాఠశాల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడడం, నీటి నిల్వ పాత్రలను మూతపెట్టడం, వారానికి ఒకరోజు డ్రై డే పాటించడం, పూర్తి చేతుల దుస్తులు ధరించడం, జ్వరం వచ్చిన వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించడం వంటి ముఖ్యమైన జాగ్రత్తలను వివరించారు.అలాగే వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, సమతుల ఆహారం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని సూచించారు.ఈ సందర్భంగా డా. ఎం. సాయి ప్రసన్న గారు పాఠశాలలోని వంటశాల (కిచెన్), ఆహార నిల్వ గది (స్టోర్ రూమ్), డైనింగ్ హాల్లను పరిశీలించారు. ఆహార పదార్థాలను పరిశుభ్రంగా నిల్వ చేయడం, వంటశాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచడం, విద్యార్థినులకు సురక్షితమైన, పోషకాహారం అందించడం, తాగునీటి పరిశుభ్రతను కాపాడడం, వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం వంటి అంశాలపై సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి రమ్యశ్రీ, హెచ్.ఈ.ఓ. శ్రీ ఎస్. సుధాకర్, హెల్త్ అసిస్టెంట్ జి. రవీంద్ర రెడ్డి, ఏఎన్‌ఎం శ్రీమతి సుభానీ బేగం, ఆశా కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మత్స్యకారుల చెంతకు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్.. కోవూరులో జనసేన సందడి!

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని వెంకటనారాయణపురంలో రాష్ట్ర మత్స్యకార సహకార సంఘం చైర్మన్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పర్యటించారు. నెల్లూరు (కోవూరు): నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మత్స్యకారుల మధ్యకు వచ్చి వారి కష్టసుఖాలను తెలుసుకోవడం తమకు ఎంతో భరోసాను కల్పించిందన్నారు మత్స్యకారులు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని వెంకటనారాయణపురం మత్స్యకార గ్రామాన్ని ఆయన జనసేన నాయకులతో కలిసి సందర్శించడం మత్స్యకారులకు ఎంతో ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందన్నారు మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి, జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల.రాష్ట్ర మత్స్యకార సహకార సంఘం చైర్మన్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కి వెంకటనారాయణపురం గ్రామంలోని మత్స్యకారులు ఆనందోత్సాహాలతో సంప్రదాయ కోలాటంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం బొమ్మిడి నాయకర్ గారు మత్స్యకారులతో ఆత్మీయంగా ముచ్చటించి వారి కుటుంబ పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించి, ఎల్లప్పుడూ మత్స్యకార కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా కల్పించారు.మత్స్యకార సంఘం నాయకులు ప్రసాద్, హరి, ఆంజనేయులు మరియు గ్రామ పెద్దల ఆత్మీయ ఆహ్వానం మేరకు బొమ్మిడి నాయకర్ గారు జనసేన నాయకులతో కలిసి గ్రామాన్ని సందర్శించి మత్స్యకార కుటుంబాలను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులను ఇబ్బందులకు గురిచేసే విధంగా తీసుకొచ్చిన జి.ఓ. నెం. 217ను అప్పట్లో పవన్ కళ్యాణ్ అడ్డంగా నిలచి తీవ్రంగా వ్యతిరేకించి, మత్స్యకార కుటుంబాల హక్కుల పరిరక్షణ కోసం అండగా నిలిచారని గుర్తు చేశారు.అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకార భరోసాను రూ.10,000 నుంచి రూ.20,000కు పెంచడం, సబ్సిడీపై డీజిల్ అందించడం, వలలు, టూ వీలర్లు, ఆటోలు వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. మత్స్యకార కుటుంబాల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. మత్స్యకార కుటుంబాలకు ఎలాంటి సమస్య వచ్చినా తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని బొమ్మిడి నాయకర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, గాదిరాజు జీవన్,ఆలియా, అలహరి సుధాకర్, ఉదయగిరి నాయకులు కాశీ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి భారీ అభివృద్ధి పర్యటన

ఉదయగిరిలో రూ.1.69 కోట్ల సీసీ రోడ్లను ప్రారంభించిన మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి. పరిశ్రమల స్థాపన ద్వారా 4 వేల మందికి ఉపాధి కల్పిస్తామని వెల్లడి. నెల్లూరు: నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, జిల్లా కలెక్టర్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం నిధులతో రూ.1.69 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఘనంగా ప్రారంభించారు. ఉదయగిరి పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నారాయణ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణం పూర్తికావడంతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు.ఉదయగిరి ప్రాంత అభివృద్ధి దిశగా ప్రభుత్వం ఇప్పటికే కీలక చర్యలు చేపట్టిందని మంత్రి వెల్లడించారు. ఈ ప్రాంతంలో నాలుగు పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయగా, వాటి ద్వారా సుమారు నాలుగు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. పరిశ్రమల స్థాపనతో యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, వలసలను తగ్గించేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. గత రెండేళ్లలో ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.34.64 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి నారాయణ వెల్లడించారు. రహదారులు, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్య కార్యక్రమాలు, మౌలిక వసతుల అభివృద్ధికి ఈ నిధులను వినియోగిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి నారాయణ పర్యటనతో ఉదయగిరి అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని తెలిపారు.వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ఉదయగిరి ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఎంపీ వేమిరెడ్డి పేర్కొన్నారు. సాగునీరు, తాగునీటి సమస్యలు పరిష్కారమవడంతో పాటు వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి రంగాల్లో విశేష పురోగతి సాధ్యమవుతుందని అన్నారు. భవిష్యత్తులో ఉదయగిరి ప్రాంతం అభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

News

ఫార్మా సిటీతో మనకు బంగారం పండుతుందా? — ప్రజల సందేహాలకు సమాధానం ఎవరిది?

ఫార్మా సిటీతో మనకు బంగారం పండుతుందా? — ప్రజల సందేహాలకు సమాధానం ఎవరిది? మేడిపల్లి, యాచారం మండలం: ముచ్చెర్ల ప్రాంతంలో ప్రతిపాదిత ఫార్మా సిటీపై మరోసారి చర్చ జోరందుకుంది. ప్రభుత్వం ఫార్మా సిటీతో భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి వస్తాయని చెబుతుండగా, పర్యావరణవేత్తలు, హక్కుల సంఘాలు మాత్రం కాలుష్యం, ఆరోగ్య సమస్యలు, వ్యవసాయానికి నష్టం వంటి అంశాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సుస్థిర అభివృద్ధి వేదిక, మానవ హక్కుల వేదిక తెలంగాణ సంయుక్తంగా విడుదల చేసిన కరపత్రంలో, పటాన్‌చెరు, జీడిమెట్ల, కాజీపల్లి, పోలేపల్లి వంటి ప్రాంతాల్లో రసాయన పరిశ్రమల వల్ల ఏర్పడిన కాలుష్యాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. పరిశ్రమల వ్యర్థాల కారణంగా భూగర్భ జలాలు కలుషితమవడం, చెరువులు దెబ్బతినడం, పంటల దిగుబడి తగ్గడం, ప్రజల్లో శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ వంటి సమస్యలు పెరిగినట్లు పేర్కొన్నారు. అదే పరిస్థితి ముచ్చెర్ల పరిసర గ్రామాలకు కూడా తలెత్తే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. ముఖ్యంగా మేడిపల్లి, మీరాఖాన్‌పేట్, కురుమిద్ది, నందివనపర్తి, అయ్యవారిగూడెం, సింగారం, తాడిపర్తి, కందుకూరు, యాచారం ప్రాంతాల ప్రజల జీవన విధానంపై దీని ప్రభావం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఫార్మా సిటీ పర్యావరణ ప్రభావ నివేదిక (EIA)లో కంపెనీల పేర్లు, తయారయ్యే ఉత్పత్తులు, వినియోగించే రసాయనాలు, వ్యర్థాల నిర్వహణ విధానం వంటి కీలక వివరాలు స్పష్టంగా లేవని ఆరోపించారు. అలాగే సుమారు 15.95 లక్షల ఉద్యోగాలు వస్తాయని పేర్కొనడంపై కూడా సందేహాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఫార్మా పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యతో పోలిస్తే ఈ అంచనా వాస్తవికంగా కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. పర్యావరణ చట్టాల ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణకు ముందుగానే సంబంధిత గ్రామాలకు పూర్తి సమాచారం అందించాలని, ప్రజలకు నివేదికలు అందుబాటులో ఉంచాలని పేర్కొంటూ, ఈ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని సంఘాలు ఆరోపించాయి. ప్రభుత్వం మాత్రం ఫార్మా సిటీ అత్యాధునిక సాంకేతికతతో, కాలుష్య నియంత్రణ వ్యవస్థలతో ఏర్పాటు చేస్తున్నామని, పర్యావరణానికి హాని జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పలుమార్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఫార్మా సిటీ వల్ల అభివృద్ధి, ఉపాధి అవకాశాలు ఒకవైపు, పర్యావరణం, ప్రజారోగ్యం, వ్యవసాయ భవిష్యత్తుపై వ్యక్తమవుతున్న ఆందోళనలు మరోవైపు చర్చనీయాంశంగా మారాయి. ప్రజలకు పూర్తి సమాచారం అందించి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని సామాజిక సంస్థలు కోరుతున్నాయి. — పున్నమి న్యూస్ ప్రతినిధి

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.