News
ఫార్మా సిటీతో మనకు బంగారం పండుతుందా? — ప్రజల సందేహాలకు సమాధానం ఎవరిది? మేడిపల్లి, యాచారం మండలం: ముచ్చెర్ల ప్రాంతంలో ప్రతిపాదిత ఫార్మా సిటీపై మరోసారి చర్చ జోరందుకుంది. ప్రభుత్వం ఫార్మా సిటీతో భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి వస్తాయని చెబుతుండగా, పర్యావరణవేత్తలు, హక్కుల సంఘాలు మాత్రం కాలుష్యం, ఆరోగ్య సమస్యలు, వ్యవసాయానికి నష్టం వంటి అంశాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సుస్థిర అభివృద్ధి వేదిక, మానవ హక్కుల వేదిక తెలంగాణ సంయుక్తంగా విడుదల చేసిన కరపత్రంలో, పటాన్చెరు, జీడిమెట్ల, కాజీపల్లి, పోలేపల్లి వంటి ప్రాంతాల్లో రసాయన పరిశ్రమల వల్ల ఏర్పడిన కాలుష్యాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. పరిశ్రమల వ్యర్థాల కారణంగా భూగర్భ జలాలు కలుషితమవడం, చెరువులు దెబ్బతినడం, పంటల దిగుబడి తగ్గడం, ప్రజల్లో శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ వంటి సమస్యలు పెరిగినట్లు పేర్కొన్నారు. అదే పరిస్థితి ముచ్చెర్ల పరిసర గ్రామాలకు కూడా తలెత్తే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. ముఖ్యంగా మేడిపల్లి, మీరాఖాన్పేట్, కురుమిద్ది, నందివనపర్తి, అయ్యవారిగూడెం, సింగారం, తాడిపర్తి, కందుకూరు, యాచారం ప్రాంతాల ప్రజల జీవన విధానంపై దీని ప్రభావం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఫార్మా సిటీ పర్యావరణ ప్రభావ నివేదిక (EIA)లో కంపెనీల పేర్లు, తయారయ్యే ఉత్పత్తులు, వినియోగించే రసాయనాలు, వ్యర్థాల నిర్వహణ విధానం వంటి కీలక వివరాలు స్పష్టంగా లేవని ఆరోపించారు. అలాగే సుమారు 15.95 లక్షల ఉద్యోగాలు వస్తాయని పేర్కొనడంపై కూడా సందేహాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఫార్మా పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యతో పోలిస్తే ఈ అంచనా వాస్తవికంగా కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. పర్యావరణ చట్టాల ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణకు ముందుగానే సంబంధిత గ్రామాలకు పూర్తి సమాచారం అందించాలని, ప్రజలకు నివేదికలు అందుబాటులో ఉంచాలని పేర్కొంటూ, ఈ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని సంఘాలు ఆరోపించాయి. ప్రభుత్వం మాత్రం ఫార్మా సిటీ అత్యాధునిక సాంకేతికతతో, కాలుష్య నియంత్రణ వ్యవస్థలతో ఏర్పాటు చేస్తున్నామని, పర్యావరణానికి హాని జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పలుమార్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఫార్మా సిటీ వల్ల అభివృద్ధి, ఉపాధి అవకాశాలు ఒకవైపు, పర్యావరణం, ప్రజారోగ్యం, వ్యవసాయ భవిష్యత్తుపై వ్యక్తమవుతున్న ఆందోళనలు మరోవైపు చర్చనీయాంశంగా మారాయి. ప్రజలకు పూర్తి సమాచారం అందించి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని సామాజిక సంస్థలు కోరుతున్నాయి. — పున్నమి న్యూస్ ప్రతినిధి