రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి
మార్టేరులోని పరిశోధనలు, నూతన వరి వంగడాలపై అవగాహన కల్పించేందుకే విజ్ఞాన యాత్ర
అనపర్తి, ఆగస్టు 31 (పున్నమి ప్రతినిధి): మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని, ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సూచించారు. అనపర్తి పంచాయతీ కార్యాలయం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “అంతరజిల్లా రైతుల వ్యవసాయ విజ్ఞాన యాత్ర” లో భాగంగా మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థకు బయలుదేరిన బస్సులను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గం, ముఖ్యంగా అనపర్తి బ్లాక్ పరిధి నుంచి సుమారు 110 మంది రైతులను మార్టేరు వ్యవసాయ పరిశోధనా సంస్థకు తీసుకెళ్లి అక్కడ జరుగుతున్న పరిశోధనలు, నూతన వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా నూతన వరి వంగడాలు, ఆధునిక సాగు పద్ధతులను రైతులకు ప్రత్యక్షంగా పరిచయం చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో కొత్త ఆలోచనలకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు.
ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రసాయన ఎరువుల అధిక వినియోగంతో భూమి సారం తగ్గిపోవడంతో పాటు పర్యావరణ, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. భూమిని సారవంతంగా కాపాడుకోవడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
సాంప్రదాయ పద్ధతుల నుంచి రైతులు ఆధునిక, ప్రకృతి ఆధారిత సాగు విధానాల వైపు రావాల్సిన అవసరం ఉందని, మార్టేరులో జరుగుతున్న పరిశోధనలు రైతుల్లో నూతన ఉత్సాహాన్ని కలిగిస్తాయని తెలిపారు. ఇతర దేశాల్లో అభివృద్ధి చేస్తున్న ఆధునిక వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేసి, వాటిని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రైతులు అవలంబిస్తే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందన్నారు.
అనపర్తి ఏ.డి. పరిధిలోని వివిధ మండలాల నుంచి రైతులను ఈ విజ్ఞాన యాత్రకు తరలించిన ఆత్మ కార్యక్రమ నిర్వాహకులకు, ఆత్మ చైర్మన్, ఏ.డి. వ్యవసాయ శాఖ అధికారులకు, ఇతర అధికారులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో అనపర్తి టౌన్ కూటమి నాయకులు, కార్యకర్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.



