అనకాపల్లి, ఆగస్టు 30: ( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ )
అనకాపల్లి పట్టణ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న నిందితులను అనకాపల్లి టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకుని, వారి వద్ద నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
కేసుల వివరాలు:
స్కూటీ డిక్కీల చోరీ కేసు: బీఆర్టీ కాలనీకి చెందిన ముప్పిడి రాజు @ జైరాజు అనే పాత నేరస్థుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఎన్టీఆర్ గ్రౌండ్ వద్ద పార్క్ చేసిన స్కూటీ డిక్కీ తెరిచి రెండు సెల్ఫోన్లు, అలాగే చోడవరం నాయుడు జ్యువెల్స్ పార్కింగ్ ఏరియాలో స్కూటీ డిక్కీ నుంచి ₹5,000 నగదు దొంగిలించినట్లు విచారణలో అంగీకరించాడు.
నిందితుడి వద్ద నుండి నగదు, సెల్ఫోన్లను రికవరీ చేసి, గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
ద్విచక్ర వాహనాల చోరీ కేసులు: అనకాపల్లి రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రదేశంలో ఒకటి, సమీపంలోని అన్నా క్యాంటీన్ వద్ద మరొకటి — ఒకే రోజు రెండు స్కూటీలను దొంగిలించిన కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ చోరీలకు ఒక మైనర్ బాలుడు పాల్పడినట్లు గుర్తించి, అతని వద్ద నుంచి రెండు స్కూటీలను రికవరీ చేశారు.
పోలీస్ అధికారులకు ఎస్పీ గారి ప్రశంసలు:
ఈ కేసులను త్వరితగతిన ఛేదించి సొత్తును రికవరీ చేయడంలో చురుగ్గా వ్యవహరించిన అనకాపల్లి టౌన్ ఎస్ఐ అల్లు వెంకటేశ్వర రావులతో పాటు ప్రతిభ కనబరిచిన సిబ్బంది సముద్రం, ఆర్.పి.నాయుడు, టీ.ఎస్.నాయుడు లను జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసించారు.


