అనకాపల్లి జిల్లా | పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్
యలమంచిలి: మండలంలోని ఏటికొప్పాక గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల పొలాల్లో పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన కర్రీ రామకృష్ణ, సూరిశెట్టి నర్సింగరావు రైతుల పొలాలను ప్రదర్శన క్షేత్రాలుగా ఎంపిక చేసి రైతులకు సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు.
గ్రామంలోని 25 మంది రైతులకు చెందిన 25 ఎకరాల్లో పొలంబడి కార్యక్రమాన్ని అమలు చేస్తూ, సాధారణ సాగు పద్ధతులకు పొలంబడి విధానానికి మధ్య ఉన్న వ్యత్యాసాలను వ్యవసాయ అధికారులు వివరించారు. విత్తనం వేసిన దశ నుంచి పంట చేతికి వచ్చే వరకు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని మండల వ్యవసాయ అధికారి మోహన్రావు తెలిపారు.
ప్రకృతి పరిస్థితులకు అనుగుణంగా పంటలకు వచ్చే చీడపీడలు, మిత్ర పురుగులను గుర్తించే విధానాలను చార్టుల ద్వారా రైతులకు వివరించారు. అనంతరం రైతుల పొలాల్లోనే ప్రదర్శన నిర్వహించి పంటల యాజమాన్యంపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకుడు కుమార్, ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది వనజ, పద్మజ తదితరులు పాల్గొన్నారు.


