ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి రాజీ ఉండదని, ప్రజలకు అందుబాటులో ఉండే పాలన అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, పట్టణ ప్రాంతాల నుంచి ప్రజలు ప్రజా దర్బార్కు హాజరై తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మొత్తం 34 అర్జీలు అందాయి. రేషన్ కార్డులు, సామాజిక భద్రత పింఛన్లు, ఇళ్ల స్థలాల మంజూరు, రహదారుల నిర్మాణం, తాగునీటి సౌకర్యాలు, డ్రైనేజీ సమస్యలు, విద్యుత్ సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ప్రజలు వినతిపత్రాలు సమర్పించారు.
ప్రతి అర్జీని మంత్రి సుభాష్ స్వయంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ప్రజల వద్దకే చేరువ అవుతోందన్నారు. ప్రజల సమస్యలను వినడమే కాకుండా వాటి పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పారదర్శక, ప్రజాకేంద్రీకృత పాలన అందిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రజా దర్బార్ వంటి కార్యక్రమాలు ప్రజలకు ప్రభుత్వంపై మరింత నమ్మకాన్ని పెంచుతున్నాయని, ప్రతి అర్జీపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించి అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ సంక్షేమ ఫలాలను ప్రతి అర్హ కుటుంబానికి చేరవేయడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉండవల్లి శివ, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనుబాబు, క్లస్టర్ 2 ఇన్చార్జ్ కంచుమర్తి బాబురావు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన అర్జీదారులు పాల్గొన్నారు.


