శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు.. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు
యాచకులకు దుస్తులు, పండ్లు పంపిణీ.. బిక్కవోలు నుంచి అనపర్తి వరకు బైక్ ర్యాలీ
బిక్కవోలు, సెప్టెంబర్ 2 (పున్నమి ప్రతినిధి): జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా బిక్కవోలులో కూటమి నాయకులు పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని కార్యక్రమాలను నిర్వహించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
బిక్కవోలు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డి, గోదావరి జిల్లాల జనసేన పార్టీ సమన్వయకర్త రావాడ నాగు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ స్వామివారిని ప్రార్థించారు.
అనంతరం దేవస్థానం ఆవరణలో నాయకులు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, మొక్కల పెంపకాన్ని ప్రజలు తమ జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు సూచించారు.
బిక్కవోలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. అనంతరం యాచకులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేసి సేవా స్ఫూర్తిని చాటుకున్నారు.
అనంతరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, గోదావరి జిల్లాల జనసేన పార్టీ సమన్వయకర్త రావాడ నాగు ఆధ్వర్యంలో నిర్వహించిన బిక్కవోలు–అనపర్తి బైక్ ర్యాలీని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డి ప్రారంభించారు. భారీ సంఖ్యలో జనసేన, టీడీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలకే పరిమితం కాకుండా పూజలు, మొక్కలు నాటడం, పేదలు, యాచకులకు సహాయం చేయడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సామాజిక బాధ్యతను చాటుకున్నామని కూటమి నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, తెలుగు మహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







