పున్నమి న్యూస్ | అనకాపల్లి జిల్లా | రిపోర్టర్ ఆనంద్
అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరు గ్రామంలో శనివారం జరగనున్న ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ జట్టి, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఎ.కోడూరులో క్షేత్రస్థాయిలో పర్యటించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమ ప్రాంగణం, హెలిప్యాడ్, వీఐపీ రూట్, బందోబస్తు ప్రాంతాలను నిశితంగా సమీక్షించారు. సీఎం పర్యటనలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఐజీ సూచించారు. ఎలాంటి అలసత్వానికి తావులేకుండా నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. భద్రతా పరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


