విశాఖపట్నంజిల్లా , (పున్నమి ప్రతినిధి ) ఆగస్టు 21: విశాఖ వేదికగా శని, ఆదివారాల్లో జరగనున్న బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా మంత్రుల సమావేశాల నేపథ్యంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన తొట్లకొండ వద్ద సాధారణ పర్యాటకులకు రెండు రోజుల పాటు అనుమతి ఉండదని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు.
శనివారం ఉదయం తొట్లకొండ వద్ద బ్రిక్స్ దేశాల ప్రతినిధులు మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు పర్యటన చేపట్టనున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే 23వ తేదీ సాయంత్రం మంత్రులు, బ్రిక్స్ దేశాల ప్రతినిధులు మరోసారి తొట్లకొండను సందర్శించనున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆగస్టు 22, 23 తేదీల్లో సాధారణ సందర్శకులకు తొట్లకొండలో ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. భద్రతా ఏర్పాట్లు, అంతర్జాతీయ ప్రతినిధుల పర్యటనను దృష్టిలో ఉంచుకుని ప్రజలు, పర్యాటకులు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.



