
ఎన్నికల వేళ ప్రశాంతంగా ఉండాలి
ముద్దనూరు : మండల పరిధిలోని చింతకుంట గ్రామంలో ఇరువర్గాల రైతుల మధ్య దీర్ఘకాలంగా నలుగుతున్న భూవివాదాన్ని ముద్దనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేష్ బాబు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి, సామరస్యపూర్వకంగా పరిష్కరించారు. వివాదానికి కారణమైన భూమిని స్వయంగా పరిశీలించిన సీఐ, ఇరుపక్షాల రైతులతో మాట్లాడారు. చట్టపరమైన అంశాలను, రికార్డులను పరిశీలించి, ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన రీతిలో కౌన్సిలింగ్ ఇచ్చి సమస్యకు సత్వర పరిష్కారం చూపారు.ఈ సందర్భంగా సీఐ నాగేష్ బాబు గ్రామస్థులతో మాట్లాడుతూ, రానున్న ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి ఘర్షణలకు, గొడవలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ శాంతిభద్రతలను కాపాడాలని స్పష్టం చేశారు. చిన్న చిన్న భూవివాదాలను పెద్దవి చేసుకొని గ్రామాల్లో ఎన్నికల వేళ శాంతి వాతావరణానికి విఘాతం కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా రైతులు, యువత ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిసేలా సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది, గ్రామానికి చెందిన పలువురు పెద్దలు, రైతులు పాల్గొన్నారు.

