లక్షలు ఖర్చుపెట్టి గెలిచినా… గౌరవం ఏదీ
సర్పంచ్ లకు శాసనసభ్యుల అధికార కార్యక్రమాల్లో గుర్తింపు కరువు..
*పనుల బిల్లులకు కొర్రీలు, వడ్డీల భారంతో సతమతం*
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు:
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి, అత్యధిక మెజార్టీతో సర్పంచ్లుగా గెలిచిన వారికి పదవి దక్కినా సరైన గౌరవం, గుర్తింపు మాత్రం దక్కడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది.
అధికారిక మరియు శాసనసభ్యుల కార్యక్రమాల్లో సర్పంచ్లకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ప్రోటోకాల్ పాటించకపోవడంతో పలువురు సర్పంచ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు సర్పంచ్లు అప్పులు చేసి, సొంత డబ్బులు వెచ్చించినా..
పనులు పూర్తయిన తర్వాత బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం.
అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండటంతో ఆర్థిక భారం మరింత ఎక్కువవుతోంది.
తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా సర్పంచ్లు వెనుకడుగు వేస్తున్న పరిస్థితి నెలకొంది.
పదవి కోసం ఎంతో ఖర్చు చేసి గెలిచినా ప్రజల ముందు తమ ఆర్థిక ఇబ్బందులను చెప్పుకోవడం సిగ్గుచేటుగా భావిస్తున్నామని కొందరు సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
అధికారిక కార్యక్రమాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు సకాలంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్లు వైరా శాసనసభ్యులు మాలోత్ రామదాసు నాయక్ ను కోరుతున్నారు.


