నిందితుడు గుడివాడ కృష్ణను వెంటనే అరెస్టు చేయాలి
అనకాపల్లి ప్రజా సంఘాలు, జర్నలిస్టుల డిమాండ్
అనకాపల్లి: విజయనగరం జిల్లా పూసపాటిరేగకు చెందిన విశాలాంధ్ర విలేఖరి పి. గోవిందుపై ఆగస్టు 19వ తేదీన జరిగిన దాడి ఘటనపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనకాపల్లి ప్రజా సంఘాలు, జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనకాపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి వినతిపత్రం అందజేశారు.
పూసపాటిరేగలో జరిగిన భూ అక్రమాలకు సంబంధించిన వార్తలను విధి నిర్వహణలో భాగంగా ప్రచురించినందుకే స్థానిక రాజకీయ నాయకుడు గుడివాడ కృష్ణ కక్షసాధింపుతో పి. గోవిందుపై కర్రలతో దాడి చేశారని వారు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటో ఆధారాలు ఉన్నప్పటికీ నిందితుడిని ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
జర్నలిస్టుపై జరిగిన దాడి కేవలం వ్యక్తిపై జరిగిన దాడిగా కాకుండా మీడియా స్వేచ్ఛపై జరిగిన దాడిగా పరిగణించాలని కోరారు. ప్రశ్నించే గొంతులను అణచివేసే విధంగా రౌడీయిజం, రాజకీయ కక్షసాధింపులకు పాల్పడే చర్యలను సహించరాదన్నారు. జర్నలిస్టులకు ప్రభుత్వం, అధికారులు తగిన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
గుడివాడ కృష్ణను తక్షణమే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఘటనపై సమగ్రంగా నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అలాగే నిందితుడిని సంబంధిత రాజకీయ పార్టీ నుంచి బహిష్కరించాలని, పి. గోవిందుకు తగిన భద్రత కల్పించి న్యాయం చేయాలని కోరారు.
గత పదేళ్లుగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పునరుద్ధరించాలని, భవిష్యత్తులో జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.


