ఖమ్మం జులై
(పున్నమి న్యూస్)
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా నాణ్యమైన విద్యతో పాటు అత్యుత్తమ మౌలిక వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి అన్నారు. బుధవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో రూ.4.85 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నాయకత్వంలో విద్యా రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అదనపు వసతి గృహం, డైనింగ్ హాల్, ఆధునిక వంటగది, అదనపు తరగతి గదులు, టాయిలెట్ బ్లాక్లు, సోలార్ ఫెన్సింగ్, ఓవర్హెడ్ ట్యాంక్ వంటి సదుపాయాలు అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. దీంతో విద్యార్థినులకు పరిశుభ్రమైన, సురక్షితమైన విద్యా వాతావరణం కలుగుతుందని చెప్పారు.
తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని, పేదరికం కారణంగా ఎవరి చదువు ఆగకూడదనేదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నైతిక విలువలను కూడా అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ రూపొందించిన ‘ఉద్దీపకం-3’ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. విద్య పూర్తయ్యాక ఉపాధి అవకాశాల కోసం ‘వారధి’ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం మంత్రి విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


