స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి ప్రభుత్వం డ్రామాలు ఆడుతోంది: పాకా సురేష్
పున్నమి ప్రతినిధి | ఆగస్టు 19, 2026
వైఎస్సార్ జిల్లా, కడప: కడప నగరంలో మాజీ మేయర్ పాకా సురేష్, మాజీ కార్పొరేటర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకా సురేష్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని విమర్శించారు.
స్థానిక ఎన్నికలను అడ్డుకునేలా ప్రభుత్వం కొత్త రామాస్త్రాన్ని వదిలిందని ఆరోపించారు. గతంలోనూ స్థానిక ఎన్నికలను సక్రమంగా నిర్వహించని చరిత్ర చంద్రబాబుకు ఉందని అన్నారు.
SIR ప్రక్రియ పూర్తయి కొత్త ఓటర్ల జాబితా విడుదలైన తర్వాతే పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కడపలోనే ముసాయిదా ఓటర్ల జాబితాలో దాదాపు 1.30 లక్షల ఓట్లపై స్పష్టత లేని పరిస్థితి ఉందని తెలిపారు. సరైన ఓటర్ల జాబితా లేకుండా పాత జాబితాతో ఎన్నికలకు వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని కూటమి ప్రభుత్వం, పచ్చ మీడియా మోసపూరిత ప్రచారం చేస్తున్నాయని పాకా సురేష్ విమర్శించారు. 2019లోనే వైఎస్ జగన్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్కు జీవో ఇచ్చారని, అనంతరం టీడీపీ నేత ప్రతాప్ రెడ్డితో కోర్టులో కేసు వేయించారని ఆరోపించారు.
50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదని తెలిసినా బీసీలను మభ్యపెడుతున్నారని అన్నారు. బీసీలను ‘బ్యాక్వర్డ్ క్లాస్’గా కాకుండా రాష్ట్రానికి ‘బ్యాక్బోన్’గా గుర్తించిన నాయకుడు వైఎస్ జగన్ అని పాకా సురేష్ పేర్కొన్నారు.

