నందలూరు మండలంలోని బస్టాండ్ కూడలి సమీపంలో కడప రోడ్డులో శనివారం సాయంత్రం ఎస్ఐ మల్లికార్జునరెడ్డి వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
ద్విచక్ర వాహనం నడిపే వారు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనానికి ఆర్సీ, ఇన్సూరెన్స్, పీయూసీ ధ్రువపత్రాలు ఉండాలని ఎస్ఐ సూచించారు. వాహనానికి నంబర్ ప్లేట్ నిబంధనల ప్రకారం ఉండాలని తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారు నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనాలు నడపాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులను హెచ్చరించారు.
వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్కు పాల్పడరాదని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ ఉపయోగించడం చేయకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం జరిమానాలు, ఇతర చర్యలు ఉంటాయని తెలిపారు.
మైనర్లకు వాహనాలు అప్పగిస్తే సంబంధిత తల్లిదండ్రులు లేదా సంరక్షకులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఎస్ఐ మల్లికార్జునరెడ్డి హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రహదారి భద్రతకు సహకరించాలని కోరారు.


