ఎరువుల యాప్లో సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి.. ఎల్నినో నేపథ్యంలో మెట్ట ప్రాంత చెరువులు నింపాలి
కాకినాడ, ఆగస్టు 29 (పున్నమి ప్రతినిధి): కాకినాడ జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అధ్యక్షతన, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ IAS ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతిపై సమావేశంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ ఎరువుల పంపిణీ కోసం ప్రవేశపెట్టిన యాప్లోని సాంకేతిక సమస్యల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా భూయజమాని, కౌలుదారు మధ్య పలు OTPలు చెప్పాల్సి రావడం వల్ల సమయం వృథా అవుతోందన్నారు. ఈ సమస్యలను శాసనసభలో ప్రస్తావించగా, అధికారులు తనను కలిసి సమస్యలను నమోదు చేసుకున్నారని, త్వరలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.
ఎల్నినో ప్రభావం నేపథ్యంలో గోదావరి నీటిని పొదుపుగా వినియోగిస్తూ మెట్ట ప్రాంతంలోని చెరువులను నింపేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రబీ సీజన్లో పంటలతో పాటు తాగునీరు, పశువుల అవసరాలు, భూగర్భ జలాల పరిరక్షణకు ఇది కీలకమన్నారు. రైతులు తక్కువ ఎరువుల వినియోగంతో సాగు ఖర్చు తగ్గించుకుని ఆదాయం పెంచుకునే విధానాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే కోరారు. సమావేశంలో ఐసీడీఎస్, డీఆర్డీఏ, డ్వామా, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, వైద్య, విద్య, బ్యాంకింగ్, పంచాయతీరాజ్ తదితర శాఖలపై సమీక్ష జరిగింది.



