6 వ వార్డు కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి
మంథని, సెప్టెంబర్ 04:
మంథని మున్సిపాలిటీ ఆరో వార్డు పరిధిలోని బోయినపేటలో నెలకొన్న విద్యుత్ సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని స్థానిక కౌన్సిలర్ పోతరవేని శ్రీలతక్రాంతి డిమాండ్ చేశారు. బోయినపేటకు వెళ్లే ప్రధాన రహదారి అయిన పాత కట్టపై విద్యుత్ స్తంభాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో రహదారి మొత్తం చీకటిగా మారుతోందని కౌన్సిలర్ తెలిపారు. ఈ మార్గంలో నిత్యం అనేక మంది ప్రజలు ప్రయాణిస్తుంటారని, సరైన వెలుతురు లేకపోవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి వీధి దీపాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బోయినపేటలో విద్యుత్ సమస్యలు ఒక్కరోజులో ఏర్పడినవి కాదని, చాలా కాలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని శ్రీలతక్రాంతి అన్నారు. సమస్యలను పలుమార్లు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజల భద్రతకు సంబంధించిన అంశాల్లో అధికారులు ఇకనైనా నిర్లక్ష్య వైఖరిని వీడి తక్షణమే చర్యలు తీసుకోవాలని శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బోయినపేట ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు ఇంకా నిర్లక్ష్యం చేస్తే ప్రజలను సమీకరించి విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని పోతరవేని శ్రీలతక్రాంతి హెచ్చరించారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు విద్యుత్ కార్యాలయం ఎదుట ఆందోళన కొనసాగిస్తామని, అవసరమైతే నిరాహార దీక్షకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు కలిగే పరిస్థితులు ఏర్పడిన తర్వాత స్పందించడం కాకుండా ముందుగానే సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ అధికారులను ఆమె కోరారు. బోయినపేటలోని అన్ని వాడలను క్షేత్రస్థాయిలో పరిశీలించి విద్యుత్ స్తంభాలు, తీగలు, వీధి దీపాలు, మీటర్ కనెక్షన్లకు సంబంధించిన సమస్యలను గుర్తించి సమగ్రంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


