పేరుకే మేజర్ పంచాయతీ.. సమస్యలే సమస్యలు.. పరిష్కారాలు కరువు!
యలమంచిలి , ఆగస్టు 20 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఎలమంచిలి మండలంలోని మేజర్ పంచాయతీ ఏటికొప్పాకలో పశువైద్యశాల ఉన్నా రెగ్యులర్ పశువైద్యాధికారి లేకపోవడం పశుపోషకులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం ఎస్ఓ, ఒక అటెండర్తోనే పశువైద్యశాల నడుస్తుండగా, ఎలమంచిలి నుంచి వారంలో రెండు రోజులు మాత్రమే వైద్య సేవలు అందుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
రూమ్ ఉంది.. కుర్చీ ఉంది.. డాక్టర్ మాత్రం లేరు! పశువులకు అనారోగ్యం, ప్రమాదం లేదా ప్రసవ సమయంలో అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే వైద్యం అందకపోవడంతో పశుపోషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయంలో పశువులను ఎలమంచిలి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు.
మేజర్ పంచాయతీ స్థాయిలో ఉన్న పశువైద్యశాలలోనే పూర్తిస్థాయి వైద్య సేవలు అందకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఏటికొప్పాకకు శాశ్వత పశువైద్యాధికారిని నియమించాలని కోరుతున్నారు. ముఖ్యంగా ఎలమంచిలి ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి పశువైద్యశాలకు పూర్తిస్థాయి సిబ్బందిని అందుబాటులోకి తీసుకురావాలని పశుపోషకులు విజ్ఞప్తి చేస్తున్నారు.


