తుక్కుగూడ నర్సు హత్యపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్!
సుమోటోగా విచారణకు ఆదేశం.. 7 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలి
తుక్కుగూడ: నర్సుపై అత్యాచారం, హత్య ఘటనను జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది. ఘటనపై తెలంగాణ డీజీపీకి NCW చైర్పర్సన్ విజయ రహత్కర్ లేఖ రాశారు.
వేగవంతమైన దర్యాప్తు చేపట్టి.. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారించాలని అధికారులను ఆదేశించింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు హత్యకు దారితీసిన కారణాలు, ఘటనకు సంబంధించిన పరిణామాలు, నిందితుడి పూర్వ నేరచరిత్రపై సమగ్రంగా ఆరా తీయాలని సూచించింది.
అదేవిధంగా నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని NCW ఆదేశించింది. కేసు దర్యాప్తు పురోగతిపై ఏడు రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని తెలంగాణ పోలీసులను కోరింది.
నర్సు హత్య కేసుపై కేంద్ర స్థాయిలో నిఘా
ఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ నేర విచారణ, నిందితుడిపై చర్యలు, కేసు పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో తుక్కుగూడ నర్సు హత్య కేసు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.



