తమిళనాడులో కొత్తగా కొలువుదీరిన సీఎం విజయ్ సర్కార్ అవినీతిపై ఉక్కుపాదం మోపింది. ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, స్వచ్ఛతను తీసుకురావడమే లక్ష్యంగా అవినీతి నిరోధక విభాగాన్ని బలోపేతం చేస్తూ ఒక సాహసోపేతమైన సరికొత్త ప్రోత్సాహక పథకాన్ని అధికారికంగా
ప్రకటించింది.
ఈ నూతన విధానం ప్రకారం ఏ ప్రభుత్వ శాఖలోనైనా సరే, మీ నుండి కేవలం రూ.1000 లంచం డిమాండ్ చేసినా.. ప్రజలు సాక్ష్యాధారాలతో స్వేచ్ఛగా ఫిర్యాదు చేయవచ్చు. లంచాలు అడిగే అధికారులపై సరైన ఆధారాలతో ఫిర్యాదు చేసిన పౌరులకు ప్రభుత్వం తరఫున రూ.1,00,000 నగదు బహుమతి ఇస్తామని సంచలన ప్రకటన చేసింది. ఇందుకోసం 24 గంటలూ అందుబాటులో ఉండేలా 1800 425 1555 అనే ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ను కూడా ప్రవేశపెట్టింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని పూర్తిగా నిర్మూలించడానికి ప్రజలను భాగస్వాములను చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా టీవీకే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రచార సమయంలోనే తాము అధికారంలోకి వస్తే ఆధార్ కార్డు తరహాలో తమిళనాడు పౌరసత్వ కార్డును జారీ చేస్తామని ప్రకటించింది. ప్రతి కుటుంబం సమగ్ర సమాచారంతో కూడిన ఈ కార్డు ద్వారా, పౌరులు ఎలాంటి దరఖాస్తులు చేసుకోకుండా లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా పుట్టినప్పటి నుంచే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలన్నీ నేరుగా వారి ఇంటి వద్దకే శాస్త్రీయ పద్ధతిలో అందుతాయని హామీ ఇచ్చారు. ప్రస్తుతం 108 సీట్లతో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్, అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం క్షేత్రస్థాయిలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే మంత్రి అధవ్ అర్జున తొలిసారిగా ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి, పరిపాలనా పారదర్శకతను పెంచే చర్యలపై చర్చించారు


