*గోపూజ.. వేదఘోష.. భజనలు.. కోలాటాలు.. హరినామ సంకీర్తనలు.. హరికథతో ఆధ్యాత్మిక సందడి*
తిరుపతి, 2026 ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి
తిరుపతిలోని టీటీడీ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో సెప్టెంబరు 4న గోకులాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీకృష్ణ జన్మదిన వేడుకలకు గోసంరక్షణశాల ఆధ్యాత్మిక వేదికగా నిలవనుంది. భక్తిభావాన్ని పెంపొందించేలా గోపూజతో పాటు వేదపఠనం, భజనలు, కోలాటాలు, సంకీర్తనలు, హరికథ తదితర కార్యక్రమాలను టీటీడీ నిర్వహించనుంది.
*గోమాత సేవ.. శ్రీకృష్ణునికి ప్రీతికరం*
గోవులను ప్రేమించిన గోపాలకృష్ణుని జన్మదినమైన గోకులాష్టమికి గోసంరక్షణశాలలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సనాతన ధర్మంలో గోమాతను పవిత్రంగా భావిస్తూ గోసేవ, గోపూజలకు విశిష్ట స్థానం కల్పించారు. ఈ సంప్రదాయాన్ని భక్తుల్లో మరింతగా పెంపొందించే ఉద్దేశంతో టీటీడీ ప్రతి ఏటా గోకులాష్టమి వేడుకలను నిర్వహిస్తోంది.
*గోకులాన్ని తలపించేలా గోసంరక్షణశాల*
గోకులాష్టమి సందర్భంగా గోసంరక్షణశాలను మామిడి తోరణాలు, పూలమాలలు, ప్రత్యేక అలంకరణలతో గోకులాన్ని తలపించేలా తీర్చిదిద్దుతున్నారు. గోవులను అందంగా అలంకరించి భక్తులకు కనువిందు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
భక్తులు గోవులకు బెల్లం, బియ్యం, పశుగ్రాసం అందించి గోసేవలో భాగస్వాములు కావచ్చు. గోమాతకు గ్రాసదానం పుణ్యప్రదమని విశ్వసించే భక్తులు ఈ పవిత్ర అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.
*ఉదయం నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు*
గోకులాష్టమి రోజున ఉదయం 5 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారికి అభిషేకం, 6 గంటలకు వేణుగానం, 7.30 గంటలకు వేదపఠనం నిర్వహిస్తారు.
టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు కళాకారులచే భజనలు, కోలాటాలు, ఉదయం 8 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే శ్రీహరి సంకీర్తనలు ఆలపిస్తారు.
ఉదయం 10 గంటలకు శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, హారతి నిర్వహిస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. భక్తులకు స్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు.
*సాయంత్రం శ్రీకృష్ణ లీలలపై హరికథ*
సాయంత్రం టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని దివ్య లీలలు, గోసేవ మహత్యాన్ని వివరించే హరికథ నిర్వహించనున్నారు.
శ్రీకృష్ణ నామస్మరణతో.. గోమాత సేవతో.. భక్తి పారవశ్యంతో సాగనున్న గోకులాష్టమి వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోపూజ, గోసేవలో భాగస్వాములు కావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
*పవిత్రోత్సవాల్లో మూడో రోజు స్నపన తిరుమంజనం:
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఉదయం స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు.
శాస్త్రోక్తంగా శ్రీ మలయప్ప స్వామివారికి, శ్రీదేవి భూదేవి సమేతంగా పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ పవిత్ర స్నపన తిరుమంజనం భక్తులకు ఆధ్యాత్మికానందాన్ని పంచింది.


