నెల్లూరు జిల్లా కొండాపురం మండలం వెలిగండ్ల దాడి ఘటన బాధితులను పరామర్శించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.
నెల్లూరు జిల్లా: కొండాపురం మండలం వెలిగండ్ల గ్రామంలో జరిగిన దాడి ఘటనలో గాయపడిన అడ్వకేట్ మంజుశ్రీతో పాటు ఆమె తల్లిదండ్రులు వరలక్ష్మి, కోటేశ్వరరావులను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పరామర్శించారు. గాయాల కారణంగా కావలి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే స్వయంగా ఆస్పత్రికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఘటనకు సంబంధించిన వివరాలను బాధితుల నుంచి తెలుసుకున్నారు. స్థల వివాదం నేపథ్యంలో కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేసినట్లు బాధితులు ఎమ్మెల్యేకు వివరించారు.దాడి కారణంగా తాము తీవ్రంగా గాయపడ్డామని, తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేను కోరారు. బాధితుల వేదనను విన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, వారికి ధైర్యం చెబుతూ అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే ఘటనపై సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకునేలా చూడాలని కోరారు. ఈ పరామర్శ కార్యక్రమంలో కావలి పట్టణానికి చెందిన పలువురు అడ్వకేట్లు, ఎమ్మెల్యేతో కలిసి పాల్గొని బాధితులకు సంఘీభావం తెలిపారు.

