ముధోల్, ఆగస్టు 8(పున్నమి ప్రతినిధి )::ప్రజా వీరుడు, బడుగు బలహీన వర్గాల నాయకుడు పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలను మండల కేంద్రమైన ముధోల్లోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ.. పండుగ సాయన్న మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం ఎరుగొని పల్లి గ్రామంలో 1840 ఆగస్టు 8న జన్మించారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడిన ప్రజా నాయకుడిగా పండుగ సాయన్నకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. పేదలకు అండగా నిలిచి, వారి సంక్షేమం కోసం పోరాడిన ఆయన ఆశయాలను నేటి తరానికి ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.


