సన్న బియ్యం సరఫరా చేయాలి: బీజేపీ డిమాండ్
కూసుమంచి, ఖమ్మం జిల్లా: పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకం ప్రయోజనాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. కొత్తగా జారీ చేసే స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాన్ని ముద్రించాలని కోరుతూ బీజేపీ కూసుమంచి మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు గడ్డం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదల ఆకలి తీర్చేందుకు ఉచిత బియ్యం పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకం ద్వారా లబ్ధి పొందుతున్న ప్రజలకు జారీ చేసే స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటోను ముద్రించాలని కోరారు.
అదేవిధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు నాణ్యమైన సన్న బియ్యాన్ని మాత్రమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పేద ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి గుగులోత్ మహేందర్ నాయక్, నేలకొండపల్లి మండల అధ్యక్షుడు పగర్తి సుధాకర్, మండల ఓబీసీ నాయకులు వడ్డెంపూడి నరేష్, నేలకొండపల్లి ఉపాధ్యక్షుడు దీవాకర్, కోటేష్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.


