ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నీట్- పీజీ పరీక్షలు!
పెద్దపల్లి, ఆగస్టు 30: తెలంగాణ జిల్లాల్లో నిర్వహించిన నీట్- పీజీ ప్రవేశ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా 2,73,183 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 1,300 కేంద్రాల్లో ఎగ్జామ్ నిర్వహించారు. ఇక తెలంగాణలో 17,627 మంది దరఖాస్తు చేసుకోగా, రాష్ట్ర వ్యాప్తంగానూ 56 కేంద్రాల్లో నీట్ ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ జిల్లాల్లో నిర్వహించిన నీట్ పీజీ 2026 పరీక్ష పరీక్షలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి, పరీక్షల నిర్వాహణను ఆదివారం జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా, కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ గౌస్ అలం, సంయుక్తంగా పర్యవేక్షించారు. కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్ మండలం నాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఏర్పాట్లను భద్రత చర్యలు పరిశీలించారు. పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థుల ప్రవేశం, సీసీ కెమెరాలు పర్యవేక్షణ, బయోమెట్రిక్ ధ్రువీకరణ, త్రాగునీరు, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాల నిర్వహణ, తదితర అంశాలను సమీక్షించారు. మంథని జేఎన్టీయూ లో నీట్ పీజీ పరీక్ష : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని మంథని జేఎన్టీయూ కళాశాలలో నీట్ పీజీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మంథని జేఎన్టీయూ కళాశాలలో 100 మంది విద్యార్థులకు గాను 98 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్థులను ఉదయం 7:30 నుంచి 8:45 వరకు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. విద్యార్థుల ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు, ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్, అడ్మిట్ కార్డును క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు.



