సత్తుపల్లి / ఖమ్మం
సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ సోషల్ మీడియా సమావేశం బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ పెట్టేం నవీన్, రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ పెట్టేం నవీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ సోషల్ మీడియా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అన్నారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.
రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా. మట్టా దయానంద్ మాట్లాడుతూ బీఆర్ఎస్ చేస్తున్న అసత్య ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్చార్జ్ కిషోర్ పోతురాజుతో పాటు ఐదు మండలాలు, టౌన్ కోఆర్డినేటర్లు, గ్రామ శాఖల సోషల్ మీడియా అధ్యక్షులు పాల్గొన్నారు.



