రూ.30 నుంచి రూ.40 కోట్లతో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక – సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి ఆనం
ఆత్మకూరు, ఆగస్టు 31( పున్నమి ప్రతినిధి) : అభివృద్ధి బాటలో ఆత్మకూరు పట్టణం వేగంగా పరుగులు పెట్టనుంది. 2027 మార్చి నాటికి రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు భారీ నిధులతో ఆత్మకూరు పట్టణానికి సరికొత్త రూపు తీసుకురావడమే తమ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.సోమవారం ఆత్మకూరు బైపాస్ రోడ్డు పనులను అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి, పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి ఇప్పటికే వివిధ పద్దుల కింద రూ.28 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధులతో సీసీ రోడ్లు, డ్రైన్లు, పార్కులు, వీధి దీపాల ఏర్పాటు, తాగునీటి వ్యవస్థ బలోపేతం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆత్మకూరు–సోమశిల ఆర్అండ్బీ రహదారి పునర్నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరయ్యాయని, త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. సంఘం–కలిగిరి–హసనాపురం మార్గంలో ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.వాసిలి–వెంకటరావుపల్లి, నాగులపాడు తదితర ప్రాంతాలకు నూతన రహదారులు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. ఈ రహదారులు పూర్తయితే రైతులకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు భూముల విలువలు పెరిగి ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.


