పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ :
ధన్యవాదాలు తెలిపిన ఏపీ ఈఎంజేఏ అనకాపల్లి జిల్లా శాఖ
యలమంచిలి : రాష్ట్ర వ్యాప్తంగా వున్న అక్రిడిడేషన్ జర్నలిస్ట్ లకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కోలుసు పార్థసారథి ప్రకటించడం పట్ల ఏపి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీ ఈఎంజేఏ జిల్లా అధ్యక్షుడు రుద్ర చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి హనుమంతరావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం మంత్రి మార్కాపురం చేరుకున్న సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు ఆయనను కలిసి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ, అలాగే నివాస స్థలాలకు సంబంధించిన అంశం గురించి చర్చించారు. స్పందించిన మంత్రి పార్థ సారథి మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితమే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీకి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పాటు ఆర్థిక శాఖ నుండి అనుమతి లభించిందని తెలిపారు. ఈ పథకం వలన రాష్ట్ర వ్యాప్తంగా వున్న సుమారు 20 వేల మంది అక్రిడిడేషన్ జర్నలిస్ట్ లకు ఉపయోగం జరగనుందని, అలాగే ఈ పాలసీ వెంటనే అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు.ఈ పాలసీ పొందిన వ్యక్తి యాక్సిడెంట్ జరిగి మృతి చెందితే ఆ కుటుంబానికి రూ 10 లక్షల రూపాయల మేరకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుందని, కావున ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన జర్నలిస్ట్ లను కోరారు. అలాగే అర్హులైన జర్నలిస్ట్ లకు నివాస స్థలాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హామీ ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీయూడబ్ల్యూజే విజ్ఞప్తి మేరకు జర్నలిస్ట్ లకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ పథకానికి ఆమోదం తెలపడం అభినందనీయమన్నారు.


