మధిర / ఖమ్మం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు విమర్శించారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లపై రాసి, దేవుడి సాక్షిగా ప్రమాణాలు చేసి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు సూచనల మేరకు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
కళ్యాణలక్ష్మి, తులం బంగారం, రూ.లక్ష సాయం, రూ.4 వేల పింఛన్, దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్, రైతు భరోసా, కౌలు రైతుల సహాయం, ఆడబిడ్డలకు స్కూటీలు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు.
పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు కేసీఆర్, బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలపై పోరాటమే లక్ష్యంగా నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు.
మధిరలో జరిగే నిరసన కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని లింగాల కమల్రాజు పిలుపునిచ్చారు.



