సి.ఆర్.జెడ్, అటవీ శాఖ చట్టాలు నిర్మాణాలకే పరిమితం చేయకుండా పర్యావరణానికి, అభివృద్ధికి మధ్య సమతౌల్యం సాధించేలా ఉండాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ విశాఖ అభివృద్ధికి గుండె కాయగా భావించే విశాఖ – భీమిలి బీచ్ రోడ్డు వెంబడి ఎలాంటి నిర్మాణాలు, రెస్టారెంట్లు, అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ఎవరైనా తప్పనిసరిగా పాటించాల్సిందేనని చెబుతూ అభివృద్ధికి ఆటంకం కాని రీతిలో ఉండాలన్నారు. సాగర్ నగర్ బీచ్ లో రూ.15 కోట్లతో ప్రతిపాదించిన ఎకాలజీ పార్కు అటవీ శాఖ అభ్యంతరంతో ఆగిపోయిందని చెప్పారు. ఇదే బీచ్ లో కోకో చెట్లు ఎండిపోతుండడంతో వాటికి నీరు పోయడానికి ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ లు రానివ్వకుండా అడ్డు చెబుతున్నారన్నారు. అమావాస్య రోజు 40 వేల మంది వరకు యాత్రికులు దర్శించుకునే సింహాచలం కాలభైరవ స్వామి ఆలయానికి సక్రమమైన దారి సహా మంచినీరు, వాష్ రూంలు, నీడనిచ్చే షెడ్ నిర్మాణానికి అటవీ శాఖ అధికారులు ఒప్పుకోలేదని పేర్కొన్నారు.
*ఇనాం భూసమస్య పరిష్కరించాలి*
భీమిలి నియోజకవర్గంలోని నారాయణరాజు పేట, బోని, కృష్ణాపురం, ముచ్చర్ల, శిర్లపాలెం, పద్మనాభం, బి.ఆర్. తాళ్లవలస గ్రామాల్లో 3 వేల ఎకరాల ఇనాం భూముల సమస్య పరిష్కరించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అసెంబ్లీలో కోరారు. రైతులకు అన్నదాత సుఖీభవ సొమ్ములు కూడా పడడం లేదని చెప్పారు. రెవిన్యూ సదస్సులో మంత్రి అనగాని సత్యప్రసాద్ రైతులకు హామీ ఇచ్చారని చెబుతూ సమస్య పరిష్కారానికి అధికారులకు నిర్దిష్ట సమయాన్ని నిర్దేశించాలని సూచించారు. ఏళ్ల తరబడి భూముల్లో ఉన్నా రుణాలు తెచ్చుకోవడానికి, పిల్లల పెళ్లిళ్ల విషయంలోనూ ఏ రకంగాను ఈ భూములు ఉపయోగపడడం లేదని తెలిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి సమస్య పరిష్కారం కోసం రైతులు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.


