ఖమ్మం నగరంలోని బాలాజీనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల జరిగిన ఘటనపై బీజేపీ జిల్లా ఎడ్యుకేషన్ సెల్ మాజీ కన్వీనర్ ఆచంటి కోటేశ్వరరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో జరిగిన ఘటనకు సంబంధించి మండల విద్యాశాఖ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారులు బాధ్యత వహించకుండా కేవలం విచారణకే పరిమితం కావడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.
ఈ ఘటనపై స్పందించిన మండల విద్యాశాఖ అధికారి విచారణ చేపడుతున్నామని మాత్రమే చెప్పారని, అయితే ఘటనకు బాధ్యత ఎవరిది? బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదని కోటేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి సైతం ఈ విషయంపై స్పందించకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ఫోన్లకు కూడా స్పందించకుండా బిజీగా ఉన్నారని ఆరోపించారు.
“బాలాజీ నగర్ పాఠశాలలో జరిగిన ఘటన వెనుక ఎవరున్నారు? అధికారుల నిర్లక్ష్యానికి కారణమేంటి?” అని ఆచంటి కోటేశ్వరరావు ప్రశ్నించారు. విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశాల్లో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


