వరికుంటపాడు పున్నమి ప్రతినిధి
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా బుధవారం వరికుంటపాడు బస్టాండ్ సెంటర్లో ఆయన చిత్రపటానికి మండల కన్వీనర్ మందలపు తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.



