రఘునాధపాలెం /ఖమ్మం
: రఘునాథపాలెం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జింకల తండా వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఇల్లందు నుంచి ఖమ్మం వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న 8 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు సమాచారం. బైక్ నడుపుతున్న 17 ఏళ్ల యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంతో రహదారిపై కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.



