యలమంచిలి నియోజకవర్గంలో “జోహార్ వైఎస్సార్” నినాదాలు
అనకాపల్లి జిల్లా, సెప్టెంబర్ 2 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
దివంగత ముఖ్యమంత్రి, ప్రజా నాయకుడు డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా యలమంచిలి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ ప్రజా సంక్షేమం, రైతుల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన కృషిని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సుందరపు ఈశ్వరరావు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించారు. పెద్దపల్లి అగ్రహారం, ఉప్పరాపల్లి, సర్వసిద్ధి తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు “జోహార్ వైఎస్సార్.. జోహార్ వైఎస్సార్.. జై కాంగ్రెస్.. జై జై కాంగ్రెస్” అంటూ నినాదాలు చేయడంతో ఆయా గ్రామాలు మార్మోగాయి.
వైఎస్సార్ పేదల పాలిట పెన్నిధి అని సుందరపు ఈశ్వరరావు కొనియాడారు. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం వంటి సంక్షేమ కార్యక్రమాలతో పేదలు, రైతుల జీవితాల్లో ఆయన చెరగని ముద్ర వేశారని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే వైఎస్సార్కు అందించే నిజమైన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.


