ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మెడికల్ షాపుల్లో నిబంధనలకు విరుద్ధంగా మందుల విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 4,500కు పైగా మెడికల్ షాపులు ఉండగా, అర్హత కలిగిన ఫార్మసిస్ట్ పర్యవేక్షణలో, వైద్యుల ప్రిస్క్రిప్షన్ మేరకే మందులు విక్రయించాల్సి ఉంటుంది. అయితే కొన్ని దుకాణాల్లో ఈ నిబంధనలు అమలు కావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ముఖ్యంగా వైద్యుల సూచనలు లేకుండానే కొన్ని రకాల మత్తు మాత్రలు, యాంటీబయాటిక్స్, ఇతర మందులు విక్రయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అబార్షన్ కిట్ల విక్రయాలపై కూడా పూర్తిస్థాయిలో నియంత్రణ ఉండాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలను ఉల్లంఘించే దుకాణాలపై తనిఖీలు నిర్వహించి, కఠిన చర్యలు తీసుకోవాల్సిన డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, అక్రమ మందుల విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.



