అక్షరాలతో పాటు జీవితానికి అవసరమైన క్రమశిక్షణ, విలువలను నేర్పేది ఉపాధ్యాయులే అంటే తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే కనుక సమాజ నిర్మాణంలోను మరియు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలోను ఉపాధ్యాయులు చేసే సేవలను గుర్తించడానికి, వారికి కృతజ్ఞతలు తెలపడానికి భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని (గురుపూజోత్సవం) ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా, మొదటి ఉపరాష్ట్రపతిగా సేవలు అందించిన గొప్ప మేధావి, తత్వవేత్త, ఆదర్శ ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపు కోవడానికి గల కారణం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1962లో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టినప్పుడు, ఆయన శిష్యులు మరియు అభిమానులు తన పుట్టినరోజును ఘనంగా నిర్వహించాలని కోరారు. దానికి రాధాకృష్ణన్ గారు స్పందిస్తూ తన జన్మదినాన్ని విడిగా జరపడం కంటే దేశంలోని ఉపాధ్యాయులందరినీ గౌరవిస్తూ “ఉపాధ్యాయ దినోత్సవం” గా జరిపితే తాను ఎంతో సంతోషిస్తానని చెప్పారు. అప్పటి నుండి అనగ 1962 నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5ను జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా జరుపుకోవడం ప్రారంభించబడింది. ఈ సందర్భంగా పున్నమి పాఠకుల కోసం ఈ కవిత గురువు విజయానికి నెలవు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
జ్ఞానమనే వెలుగుతో అజ్ఞానాన్ని తొలగించి
సరైన దారిలో జీవించమని దారి చూపించి
అందమైన భావి భవిష్యత్తును
నిర్మించ శ్రమించు నిగర్వి .. గురువు
నడవడికను నేర్పే నిరంతర శ్రామికుడు
అజ్ఞానంపై నిత్యం యుద్ధం చేసే సైనికుడు
తల్లిదండ్రుల తర్వాత దైవం పంపిన
మార్గదర్శకుడు .. గురువు
రాతిబండను శిల్పి విగ్రహంగా మార్చినట్లు
తను కరుగుతూ దీపం కాంతి పంచినట్లు
శిష్యుల ఎదుగుదలను చూసి మురిసిపోయే
నిస్వార్థ త్యాగశిఖరం.. గురువు
కొనలేని జ్ఞానాన్ని ఉచితంగా పంచిపెట్టి
సామర్ధ్య శక్తులను పెంపొందించ తలపెట్టి
మెరుగైన శిక్షణకై సమజ్జీవులతో పోటీపెట్టే..
జగతిలో ప్రగతి పర్యవేక్షకుడు .. గురువు
విద్యార్థుల హార్థికరూప ప్రాకారాన్ని ఏర్పరచి
అభ్యర్థుల హృదయాంతరాలలో సంచరించి
ఒడిదుడుకుల జీవన గమనంలో దిక్చూచై
విజయతీరాలకు చేర్చే నాయకుడు ..
జీవిత ధర్మ పరిరక్షకుడు.. గురువు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹



