మాలకొండ లక్ష్మీనరసింహుడి చెంతకు 107 కి.మీ. కాలినడకన రైతుల మొక్కు
ఆత్మకూరు , సెప్టెంబర్ 3 (పున్నమి ప్రతినిధి):
వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు సుభిక్షంగా పండాలని కోరుతూ నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలానికి చెందిన రైతులు భక్తిశ్రద్ధలతో 107 కిలోమీటర్ల మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. శ్రీకొలను, చిరమన గ్రామాలకు చెందిన సుమారు 50 మంది రైతులు గురువారం తెల్లవారుజామున హసనాపురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు.
ప్రకాశం జిల్లాలోని ప్రసిద్ధ మాలకొండ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వరకు కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించనున్నట్లు రైతులు తెలిపారు. పాదయాత్ర ప్రారంభ సమయంలో రైతులు గోవిందా నామస్మరణ చేస్తూ ముందుకు సాగారు.
వ్యవసాయానికి వర్షమే ప్రధాన ఆధారమని, వరుణదేవుడు కరుణిస్తేనే సాగు సజావుగా సాగుతుందని రైతులు పేర్కొన్నారు. గత కొంతకాలంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో తమ కష్టాలు తొలగి, సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కాలువలు నిండాలని ఆకాంక్షించారు.
మాలకొండ లక్ష్మీనరసింహ స్వామిని ప్రార్థించి వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులకు మంచి పంటలు, ప్రజలకు సుభిక్షం కలగాలని మొక్కులు చెల్లించనున్నట్లు తెలిపారు. రైతుల పాదయాత్రకు స్థానికులు, గ్రామస్తులు మద్దతు తెలుపుతూ వారికి శుభాకాంక్షలు అందించారు.


