గొల్లపల్లి నుంచి డక్కునూరు వరకు.. వరుసగా ఆరోపణలు
నేడు డక్కునూరు.. రేపు ఏ గ్రామం?
ప్రభుత్వ భూములకు రక్షణ ఎప్పుడు? అన్నదే మండల ప్రజల ప్రశ్న..
రెవెన్యూ శాఖ మౌనం వెనుక మతలబేంటి?
జిల్లా అధికారుల జోక్యాన్ని కోరుతున్న గ్రామస్థులు
వరికుంటపాడు పున్నమి ప్రతినిధి.
మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణల ఆరోపణలు వరుసగా తెరపైకి వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. వరికుంటపాడు మండలం లోని గొల్లపల్లి, కొండయ్యపాలెం, కనియంపాడు గ్రామాల తర్వాత తాజాగా మంగళవారం డక్కునూరు గ్రామంలోనూ భూ ఆక్రమణకు సంబంధించిన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.ఒక గ్రామం తర్వాత మరో గ్రామం.. అసలు మండలంలో ఏం జరుగుతోంది? అంటూ గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ, పోరంబోకు, పశువుల మేత భూములపై ఆక్రమణల ఆరోపణలు వస్తున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తున్నారు.
భూ ఆక్రమణలపై స్థానిక అధికారులకు సమాచారం అందించినప్పటికీ తగిన చర్యలు కనిపించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీంతో అధికారులు ఆక్రమణలను అడ్డుకుంటున్నారా? లేక అధికార పార్టీకి చెందిన వారిపై చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మండలంలోని ప్రభుత్వ భూములపై సమగ్ర సర్వే నిర్వహించి, గొల్లపల్లి, కొండయ్యపాలెం, తిమ్మారెడ్డిపల్లి, కనియంపాడు, డక్కునూరు గ్రామాల్లో వచ్చిన ఆరోపణలపై వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని గ్రామస్థులు కోరుతున్నారు. నేడు డక్కునూరు.. రేపు ఏ గ్రామం? ప్రభుత్వ భూములకు రక్షణ ఎప్పుడు? అన్నదే మండల ప్రజల ప్రశ్న.


