బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ విభాగం మాజీ అధ్యక్షుడు తాజుద్దీన్ (తాజ్ భాయ్) సంస్మరణ సభ ఖమ్మంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పాల్గొని తాజ్ భాయ్ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ తాజ్ భాయ్తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇతరులకు కష్టం వచ్చినప్పుడు అర్ధరాత్రి అయినా స్పందించే తాజ్ భాయ్, ఆకస్మికంగా గుండెపోటుకు గురై ఒంటరిగా ఆస్పత్రికి వెళ్లడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. సమయానికి వైద్యం అందితే కాపాడుకునే అవకాశం ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజ్ భాయ్కు వ్యక్తిగత అజెండా లేదని, కేసీఆర్ నాయకత్వం, బీఆర్ఎస్ బలోపేతమే ధ్యేయంగా పనిచేశారని అన్నారు. కరోనా సమయంలో పేదలు, మైనారిటీలకు వైద్య సహాయం అందించడంతో పాటు మసీదులు, శ్మశానవాటికలకు అభివృద్ధి నిధులు మంజూరు చేయించారని తెలిపారు. ఖమ్మంలో బాలుర, బాలికల కోసం రెండు TMREIS పాఠశాలల మంజూరులో ఆయన కృషి మరువలేనిదన్నారు.
తాజ్ భాయ్ కుమార్తెను తన మమత డెంటల్ కాలేజీలో డెంటల్ డాక్టర్గా తీర్చిదిద్ది, మేనమామగా వివాహ బాధ్యతను చేపడతానని అజయ్ కుమార్ హామీ ఇచ్చారు. కార్యకర్తలకు మమత హాస్పిటల్లో ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. తాజ్ భాయ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.



