విజయవాడ, జూలై 19 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు విజయవాడలో బీజేపీ ప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జీలు, BLA-1ల సమావేశం నిర్వహించారు.
సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాజ్యసభ సభ్యుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, జాతీయ కార్యదర్శి రితురాజ్ సిన్హా, రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, ఎంపీలు దుగ్గుబాటి పురందేశ్వరి, పాక సత్యనారాయణ, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సమగ్ర ఓటరు సవరణ కార్యక్రమంలో BLA-2లు, BLA-1లు చేపట్టిన పనితీరును నాయకులు సమీక్షించారు. ప్రతి బూత్ను మరింత బలోపేతం చేయడం, ప్రతి ఓటరిని చేరుకోవడం, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని గ్రామ స్థాయి వరకు విస్తరించడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి అనుసరించాల్సిన కార్యాచరణపై సమగ్రంగా చర్చించి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
బూత్ స్థాయి కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, ప్రతి బూత్లో సమర్థవంతమైన నిర్వహణ, ఓటర్లతో నిరంతర అనుసంధానం, సమన్వయంతో కూడిన కార్యాచరణ ద్వారా బీజేపీ విజయానికి బలమైన పునాది వేయవచ్చని నాయకులు పేర్కొన్నారు.



