1901 మార్చి 16న మద్రాసులో జన్మించి మద్రాసు ప్రెసిడెన్సీ నుండి తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం కోరుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి డిసెంబర్15, 1952న ప్రాణాలర్పించి ‘ఆంధ్ర రాష్ట్ర పితామహుడు’ గా కీర్తించబడిన మహనీయుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఆయన బలిదానం తర్వాతే 1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఇది దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికింది. ఆయన స్మృత్యర్థం 2008లో నెల్లూరు జిల్లాను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా ప్రభుత్వం పేరు మార్చింది. తన 125వ జయంతి రోజు అమరావతిలో ఆయన గౌరవార్థం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ అనే పేరుతో ఒక భారీ విగ్రహాన్ని మరియు స్మృతి వనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఈ కవిత
*అ* అందరి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రము కావాలని
*మ* మద్రాస్ ప్రెసిడెన్సీలో మార్పులు రావాలని
*ర* రణముచేయని రాజీపడని స్వాతంత్ర్య సమరయోధుడు
*జీ* జీవం తెలుగు రాష్ట్రం కోసం అన్న దీక్షపరుడు
*వి* విశ్వాసాన్ని ఊపిరిగా చేసుకున్న త్యాగధనుడు
*శ్రీ* శ్రీకారం తెలుగుజాతి ఆకారంగా మలచగ
*పొ* పొదిగి ఒదిగి ఎదిగిన దేశభక్తి నాయకత్వం
*ట్టి* ఏట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగెయ్యని భావతత్వం
*శ్రీ* శ్రీరస్తుగ గాంధేయ మార్గంలో ప్రయాణించగ
*రా* రాజ్యాధినేతలను ఆలోచింపజేయగ
*ము* ముదావహమైన త్యాగస్పూర్తితో అమరుడై
*లు* లుప్తశరీరము నేడు 58 అడుగుల విగ్రహమై (అమరావతిలో)
*జ* జనం మదిలో నూతన ఆంధ్రావతరణ ప్రకాశమై
*యం* యంత్రాంగపాలన సత్సంగ జనతరంగమై
*తి* తిరుగులేని మహాత్ముని ఆత్మీయ అమరజీవి
ఆంధ్రుల నిత్య ఆరాధ్య సంజీవి
తెలుగు ప్రజల మనోఫలకం చెక్కిన చిరంజీవి


