మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్
మంథని, సెప్టెంబర్ 04:
భావితరాలకు స్వచ్ఛమైన, పచ్చని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మంథని మున్సిపాలిటీ పరిధిలోని ప్రముఖ శ్రీ మహాలక్ష్మి దేవాలయం వద్ద స్థానిక కౌన్సిలర్ మారుపాక నిహారికతో కలిసి శుక్రవారం భక్తులకు, స్థానిక ప్రజలకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ… పెరుగుతున్న కాలుష్య నివారణకు చెట్లు నాటడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా, అవి మహా వృక్షాలుగా మారే వరకు సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని కోరారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి పౌరుడు తమ వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్. మనోహర్, వైస్ చైర్మన్ సహేందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు నూకల కమల్, జంభోజు శ్రీమతి, పెంటరి రాజు, జంభోజ్ సమ్మయ్య, దుద్దిల్ల గణపతిలతో పాటు మున్సిపల్ సిబ్బంది, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


