తాళ్లపూడి పున్నమి ప్రతినిధి, జూలై 21:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షులు, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే దివంగత జి.ఎస్.రావుకు మంగళవారం పలువురు రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామంలోని ఆయన స్వగృహానికి చేరుకుని జి.ఎస్.రావు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన తనయులు, మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస నాయుడు, జి. శ్రీతారాం, మనవడు జి. వరుణ్ సాయిని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర మాజీ హోంమంత్రి తానేటి వనిత, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకటరావు, మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, రాజానగరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ పరిశీలకులు తోట రామకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మన్ బండి పట్టాభిరామారావు (అబ్బులు), తాళ్లపూడి మాజీ ఎంపీపీ కొమ్మిరెడ్డి పరశురామారావు, ఇంటి వీర్రాజు తదితరులు పాల్గొని జి.ఎస్.రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.


