వరదయ్యపాలెం మండలంలో ఓటర్ల గుర్తింపు, ఓటరు జాబితాల పరిశీలన కార్యక్రమంలో భాగంగా పలు ప్రాంతాల్లో గ్రామసభలు నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ఓటర్ల వివరాలను పరిశీలించి, అర్హులైన ప్రతి ఓటరును గుర్తించే ప్రక్రియపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు బసిరెడ్డి, శివకుమార్ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించగా, ఇందిరానగర్లో ఎంపీడీవో విజయమ్మ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామసభలకు హాజరైన ప్రజలకు ఓటరు జాబితాల పరిశీలన విధానం, వివరాల సవరణ, అర్హులైన ఓటర్ల గుర్తింపు వంటి అంశాలపై వివరించారు.
ఈ సందర్భంగా అధికారులు ఓటరు జాబితాల్లో తమ పేర్లు సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. పేరు, ఇంటి చిరునామా, వయస్సు, ఇతర వ్యక్తిగత వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి సరిచేసుకోవాలని కోరారు.
అలాగే అర్హత ఉన్నప్పటికీ ఇంకా ఓటరు జాబితాలో పేరు నమోదు కాని వారు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.
గ్రామస్థులు తమ కుటుంబ సభ్యుల ఓటరు వివరాలను కూడా పరిశీలించడంతో పాటు, ఏవైనా పొరపాట్లు లేదా మార్పులు ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఓటరు జాబితాలను మరింత కచ్చితంగా, పారదర్శకంగా రూపొందించేందుకు ప్రజలందరూ సహకరించాలని అధికారులు కోరారు.
ఈ గ్రామసభల ద్వారా ఓటర్ల గుర్తింపు ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
✍️మహ్మద్ షఫివుల్లా
పున్నమి దినపత్రిక
సత్యవేడు నియోజక వర్గం
ఇంచార్జ్


