ముదిగొండ,/ఖమ్మం
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు విమర్శించారు. శనివారం ముదిగొండ మండలం చిరుమర్రి గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ మండల స్థాయి విస్తృత సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు, పేదల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు, రైతుబీమా వంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కమల్రాజు తెలిపారు. పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.



