*బుచ్చినాయుడుకండ్రిగ, ఆగస్టు 29
మండలంలోని నెలవాయి, వేణుగోపాలపురం గ్రామ పంచాయతీలలో శనివారం నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కూరపాటి శంకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో పర్యటించిన ఆయనకు స్థానిక నాయకులు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. కంప్పవారిపాలెంలో నూతనంగా నిర్మించిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ మహామండపోత్సవానికి, విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో శంకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.
అనంతరం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తుమ్మల సుందరనాయుడిని శంకర్ రెడ్డి పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి అవసరమైన వ్యక్తిగత సాయం అందించడంతో పాటు, భారీ రూపాయల వైద్య ఖర్చులు అవసరమైతే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు.
వై.పరట్టూరు లోని ఓ చాక్లెట్ కంపెనీలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన సునీల్ కుటుంబ సభ్యులను శంకర్ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి బాధిత కుటుంబానికి అందాల్సిన నష్టపరిహారాన్ని త్వరితగతిన ఇప్పించేందుకు కృషి చేస్తామని, పార్టీ తరఫున కూడా తగిన ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు వై. చెంచురామానాయుడు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కన్నవరాయుడు, జిల్లా మీడియా కోఆర్డినేటర్ కార్తీక్ నాయుడు, క్లస్టర్ ఇన్చార్జి మణిచంద్రనాయుడు, ఐటీడీపీ విజయ్, రవినాయుడు, మధునాయుడు, మునిరాజా, మనోహర్ నాయుడు, రాజేంద్ర, పవన్, మునయ్య, రమేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


