బి.ఎన్.కండ్రిగలో అధికార పార్టీ నాయకులు, స్థానిక అధికారుల అండదండలతో పేదల ఇళ్లను కూల్చివేయడానికి కుట్ర జరుగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా ఓబీసీ కాలనీలో నివాసముంటున్న పేదలను ఇళ్ల నుండి బలవంతంగా ఖాళీ చేయించి, రోడ్డున పడేసేందుకు కొందరు నేతలు చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. గతంలో శాసనసభ్యుల చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పొంది, ప్రశాంతంగా జీవిస్తున్న తమపై స్థానిక రెవెన్యూ అధికారులు, కొందరు అధికార పార్టీ నేతలు కక్షగట్టారని బాధితులు మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీ యంత్రాలను తీసుకొచ్చి ఇళ్లను, ప్రహరీ గోడలను కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అధికారులు వారికి మద్దతు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుట్ర వెనుక ప్రధానంగా సుధారాణి, భద్ర శేషమునాయుడు అతని అనుచరులు అధికార పార్టీ పాటు స్థానిక అధికారులు రాజకీయ బలంతో పాటు, కొందరు అధికారులు మామూళ్లకు లొంగిపోయి పేదల పొట్ట కొడుతున్నారని, తమకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ యంత్రాంగమే నేతలతో చేతులు కలపడం దారుణమని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
*కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం*
స్థానిక అధికారుల తీరుపై నమ్మకం లేదని, అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి తమకు అన్యాయం చేస్తున్న అధికారులపై ఉన్నతాధికారులకు, జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని బాధితులు హెచ్చరించారు. ప్రాణాలు పోయినా తమ ఇళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి అధికార పార్టీ నేతల అక్రమాలను, అధికారుల ఏకపక్ష వైఖరిని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.

