భద్రాచలం, ఆగస్టు 31: భద్రాచలం పట్టణంలోని కొరకట్ట రోడ్డులోని కాకతీయ గ్రాండ్ కమ్మ సత్రంలో టీజీఎస్ఆర్టీసీ భద్రాచలం డిపో ఉద్యోగులు రమణ, ఏడీసీ, అల్లం నాగేశ్వరరావు, స్టేషన్ మేనేజర్ పదవీ విరమణ సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ, పట్టణ ప్రముఖులు తాళ్లూరి పంచాక్షరయ్యతో కలిసి హాజరయ్యారు.
పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సేవలో ఎన్నో సంవత్సరాలు అంకితభావంతో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందడం గర్వించదగ్గ విషయమన్నారు. ఉద్యోగ జీవితంలో వారు అందించిన సేవలను అభినందించారు.
పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆరోగ్యంగా, ప్రశాంతమైన జీవితం గడపాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఉద్యోగుల సేవలను గుర్తు చేసుకుంటూ భవిష్యత్ జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




